Friday, November 1, 2013

పాలకూర అన్నం

కావలసిన పదార్థాలు: 

బియ్యం - 3 రైస్ కప్పులు.
పాలకూర - ఒక పెద్ద కట్ట.
ఉల్లిపాయలు - పెద్దది ఒకటి.
పచ్చిమిరపకాయలు - 6.
జీడిపప్పు - 1/2 కప్పు.
మిరియాలు - 1/2 చెంచా.
లవంగాలు - 4. 
మినప్పప్పు - 1 చెంచా.
ఆవాలు - 1/2 చెంచా.
జీలకర్ర - 1 చెంచా.
ఉప్పు - తగినంత.
గరం  మసాలా పొడి - 1/2 చెంచా.

తయారు చేయు విధానం:

ముందుగా అన్నం వండుకోవాలి.
మిరియాలని పొడి చేసుకోవాలి.
పాలకూరని శుభ్రంగా కడిగి, తరగాలి. ఈ పాలకూర తరుగు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు మిక్సీలో వేసి ముద్దలా తిప్పాలి.
మూకుట్లో నూనె వేసి లవంగాలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేయించి అవి బాగా వేగాక ఈ పాలకూర ముద్దని వేసి బాగా కలపాలి. ఇప్పుడు మంటని కాస్త తగ్గించి ఈ ముద్దని 10-15 నిముషాలు బాగా ఉడకనివ్వాలి. తరువాత ఇందులో తగినంత ఉప్పు, మిరియాల పొడి,  గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన అన్నం వేసి అంతా బాగా కలపాలి. మంట మరికాస్త తగ్గించి, మధ్య మధ్యలో కలుపుతూ ఒక 15 నిముషాలు ఉంచాలి. ఉప్పు అవీ చూసుకుని ఇంక ఆపెయ్యచ్చు.

ఇది తయారు అయ్యాక ఒక పావుగంట అయినా మూట పెట్టి ఉంచాలి. దీన్ని తయారు చేస్తున్నప్పుడు ఇది బాగా ముద్దగా ఉన్నట్టు ఉంటుంది కానీ, కాసేపు అలా ఉంచితే అన్నం ఆ పాలకూర ముద్దని పీల్చుకుని కాసేపట్లో విడివిడిగా అవుతుంది.

గమనికలు:

1.  పోపులో పాలకూర ముద్ద వేసే ముందు అల్లం-వెల్లుల్లి పేస్టు కూడా వేసుకోవచ్చు. కానీ, ఆఫీసు లో డబ్బా మూత తీయగానే ఘాటుగా వాసన రాకుండా ఉండడానికి దీనిని నేను వేయను.
2. పోపు ఇలాగే వెయ్యాలి అని నిబంధన ఏమీ లేదు. ఇది నా సొంత కల్పన. మీకు నచ్చినట్టు మీరు వేసుకోవచ్చు. పోపులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. కానీ, ముద్ద తిప్పినప్పుడు వేశాము కాబట్టి, దానికి బదులు వేరుశనగ గుడ్లు వేసుకోవచ్చు.
3. అదే విధంగా, వండిన అన్నాన్ని కలపడానికి బదులు బియ్యాన్ని ఉడికించిన పాలకూర ముద్దలో వేసి కూడా వండుకోవచ్చు. మీకు ఏది సులువు అయితే అది.
4. మా ఇంట్లో, మా స్నేహితులలో ఈ వంటకం చాలా ప్రాచుర్యం పొందింది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటున్నారు. పాలకూర ముద్ద తిప్పినప్పుడు పచ్చిమిరపకాయలు బాగా తగ్గించుకుని, అలాగే, నేతి పోపు వేసి వాళ్ళకి ఈ వంటకం చేసి పెడితే ఎగరేసుకుపోతారు. (అని నా అనుభవం చెబుతోంది).  పైగా ఎంతో ఆరోగ్యం కూడాను.

Wednesday, February 1, 2012

బొడ్డుతాడు లో బంగారం

చాలా మంది మిత్రులతో, తెలిసినవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం దొర్లుతూ వుంటుంది - ముఖ్యంగా ఇక్కడ (అమెరికా లో). "పిల్లలు పుట్టినప్పుడు మూలకణాలు (స్టెం సెల్స్) దాచాలా వద్దా అని ఆలోచిస్తున్నాము" అని, "మీరు దాచారా" అనీ. తెలియని వాళ్ళ కోసం (మళ్ళీ తర్జుమా లో అర్ధం మారిపోకుండా చూసింది చూసినట్టు) - courtesy http://www.cordblood.com/cord_blood_faqs/cord_blood.asp :
Cord blood is the blood that remains in your newborn's umbilical cord after birth. Cord blood, like bone marrow, is an invaluable source of a type of stem cell that can be used in a variety of medical treatments.
Stem cells are the body's "master cells" because they are the building blocks of organ tissue, blood, and the immune system. Stem cells from bone marrow were first used to regenerate blood and immune cells for patients who had received chemotherapy for cancer. In the late 1980s, doctors started using cord blood stem cells to treat diseases that had previously been treated with bone marrow transplantation. Today, cord blood stem cells are successfully being used and saving many lives. And they are being researched in an exciting new area of medicine called regenerative medicine, where scientists are using cord blood stem cells in experimental treatments for brain injury and juvenile diabetes.
Cord blood stem cells are biologically younger and have unique qualities and advantages compared to other stem cell sources like bone marrow: There is less risk of complications when used in transplants. They are immediately available, and early treatment can minimize disease progression. Freezing them "stops the clock" and protects them from environmental damage, age, and common viruses that will impact the stem cells in our bodies over time. Collection of cord blood is simple, safe, and painless.

ఆరోగ్య విజ్ఞానం ఊహిచనంత వేగం తో అభివృద్ది చెందుతోంది - ఒక పదేళ్ళు బ్రతికితే ఇంకో పదేళ్ళు బ్రతికించడానికి సరిపడా మందులు, పరికరాలు, చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. అటువంటప్పుడు "ఎందుకు పనికి వస్తుంది" అనుకోకుండా వీలుంటే ఇటువంటి వాటిని అందిపుచ్చుకోవడమే సబబుగా తోస్తుంది. ఎవరూ తమకి, తమ పిల్లలకి ప్రాణాంతక రోగాలు రావాలని కోరుకోరు. కాని, ఎప్పుడైనా అటువంటివి ఎదురైతే మాత్రం ఒక ఆసరా ఉంది అన్న ధైర్యం చాలా బలాన్నిస్తుంది. ఎక్కువ మంది దగ్గర విన్న ఆర్గుమెంట్ ఏమిటంటే, "ఇంత ఖర్చు పెట్టడం కష్టమండీ" అని. అది వింటే కోపం కంటే జాలి వేస్తుంది. ఎన్ని అనవసర ఖర్చులు పెడతాము మనం? నెలకి ఎనభై డాలర్లు పెట్టి కేబులు, వందలు పెట్టి బయట తినడమో చేస్తూనే ఉంటాము కదా? ఆరునెలలు అవి మానుకుంటే బిడ్డ కార్డ్ బ్లడ్ దాచచ్చు. "రేపు దాని ఉపయోగం ఏమిటో తెలియకుండా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టడం రిస్కు కదా" అని కూడా విన్నాను. ఏది రిస్కు? ఇప్పుడు రెండువేలు ఖర్చుపెట్టడమా లేక రేపు కష్టపడడమా? మా తాత గారి చద్దిమూట లోంచి ఒక ముద్ద: "డబ్బు దాచినప్పుడు దాచాలి, ఖర్చు వచ్చినప్పుడు మాత్రం చూసుకోకూడదు". నిజంగా. కొన్ని సార్లు లాజిక్కులు లాగకుండా ఏది సరి ఐనదో అది చెయ్యడమే తెలివైన పని. ఇప్పటికే స్టెం సెల్స్ ఉపయోగించి అనేక జబ్బుల్ని నయం చేయవచ్చని, పాడైన అవయవాల స్థానం లో కొత్తవి సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు. రేపు పొద్దున్న ఇంతకంటే మంచి విధానం ఇంకోటి రావచ్చు. కాని, ఇప్పుడు అందుబాటులో ఉన్న దీన్ని వాడుకోవడమే ఉత్తమం.

Tuesday, December 27, 2011

మంచి మనిషి.

ఇంజనీరింగ్ అయిన వెంటనే ఏమి చెయ్యాలా అన్న విషయం ఇంజనీరింగ్ చేస్తున్నన్నాళ్ళూ పెద్దగా ఏమి అనుకోలేదు. అందరూ గేటు రాస్తున్నారంటే నేను కూడా రాసా.. ఏదో జరిగి మార్కులూ బాగానే పడ్డాయి - ఐ ఐ టీ మిస్ అయి మద్రాస్ లో అన్నా యూనివర్సిటీ లో చేరాను కంట్రోల్ సిస్టమ్స్ లో. అసలే ఇంటి బయట ఉండడం మొదటి సారి, మన భాష/ఊరు కాని ప్రదేశం, ముఖ్యం గా ముందు గా తెలిసి ఉన్న స్నేహితులు లేకపోవడం (అందుకే తరవాత ఇంకా ఎక్కువ దూరం అయిన అమెరికా వచ్చినా కూడా ఇక్కడ అప్పటికే తెలిసిన స్నేహితులు ఉండడం తో అస్సలు ఇబ్బంది లేకుండా కలిసిపోయాను), నన్ను అక్కడ ఉండనివ్వలేదు. దానికి తోడు చీకటి గుయ్యారాల లాంటి హాస్టల్ రూములు, రోజుకొకసారి కనిపించే ఈనాడు పేపర్, రుచీ పచీ లేని హాస్టల్ భోజనం - మనకి ఒకటి నచ్చక పొతే అన్నీ భూతద్దాలలోంచి కనిపిస్తాయి కదా - మొత్తానికి ఈ కాలేజీ మనకోసం కాదు అన్న విషయం నిర్ణయం అయిపొయింది. దానికి తోడు, అక్కడ చేరిన ఒక వారం రోజులకి విశాఖపట్నం గీతం లో నాతో చదివిన స్నేహితుడు అమెరికా వీసా కి రావడం, అతని ద్వారా జీ ఆర్ ఈ కి ఎలా తయారవాలి తదితర విషయాలు తెలుసుకోవడం వల్ల అమెరికా పురుగు గట్టిగా కుట్టింది. మనం ఏదైనా పని చెయ్యడానికి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినా ఆ చివరి తోపు ఒకటి రావాలి - అంటే, మన నిర్ణయాన్ని ఎవరో ఒకరు సమర్ధించాలి అన్నమాట. ఆ తోపు నా విషయం లో ఇంటి దగ్గర నుంచి ఉత్తరం రూపం లో వచ్చింది. "నీకు అక్కడ నచ్చకపోతే పరవాలేదు నాన్న.. వచ్చెయ్యి" అని అమ్మ నుంచి ఉత్తరం. ఇంకేముంది, చేరిన ముఫ్ఫైయ్యవ రోజు తిరిగి వెళ్ళడానికి ముహూర్తం పెట్టాను. అయితే అప్పటికే కాలేజీ లో వివిధ విభాగాలలో మనం కట్టిన ఫీజులు, సెక్యూరిటీ డిపాజిట్లు, టీ సీ తీసుకోవానికి క్లియరన్సులు అవన్నీ చెయ్యాలి. సమయం ఎక్కువ లేదు. అన్ని పనులూ అయిపోతున్నాయి కాని, డిపార్ట్మెంట్ క్లియరన్సు మాత్రం హెడ్ గారు ఇవ్వాలి - అది అవడం లేదు - ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగోక ఇంట్లో ఉన్నారు అని చెప్పారు. ఆయన పేరు డాక్టర్ సంబంధం. బక్క పల్చగా, అడ్డ బొట్టు తో, ఒక యాభై అరవై మధ్య వయసులో ఉండేవారు. "సమయానికి ఇలా అయిందేమిటి" అనుకుంటుంటే అటెండర్ చెప్పాడు - "మీరు వెనక్కి వెళ్ళిపోయి సార్ ఆరోగ్యం బాగు అయ్యాక రావచ్చు, అప్పుడైనా మీ టీ సీ తీసుకొని వెళ్ళొచ్చు" అని. మనం లోకల్ అయితే అది మంచి ప్లానే కాని, ఎక్కడో వైజాగ్ వెళ్లి మళ్ళీ తిరిగి మద్రాస్ రావడం తప్పని సరి ఐతే తప్ప చేయలేము. ఏమి చెయ్యాలిరా అనుకుంటూ ఉండగా ఆలోచన వచ్చింది - "ఆయన ఇంటికి వెళ్లి పరిస్థితి వివరించి రిక్వెస్ట్ చేస్తే?" అని. అటెండర్ ని చిరునామా కనుక్కొని వారి ఇంటికి వెళ్లాను. వారి అమ్మాయి అనుకుంటాను చెప్పింది - "ఆయన కి వంట్లో బాగాలేదు, హాస్పిటల్ కి వెళ్ళారు, ఫలానా వ్యక్తి వచ్చి వెళ్ళారు అని చెబుతాను" అని. "ఇది ఇంక అయ్యే పని కాదు - విశ్రాంతి తీసుకుంటున్నారేమో ఒక సారి వచ్చి నా పని చూసి వెళ్ళమని అడుగుదాము అనుకున్నాను కాని, ఇక్కడ విషయం చూస్తే సరిగా లేదు" అని. ఊసురోమని మళ్ళీ హాస్టల్ కి వచ్చి పడ్డాను. మరుసటి రోజు పొద్దున్న డిపార్టుమెంటు దగ్గర కి వెడుతుంటే ఆటో లోంచి దిగుతూ సంబంధం గారు కనిపించారు. నీరసం గా, ఒక చేత కర్ర సాయం తో అడుగులు వేస్తూ, అటెండర్ చేయి పట్టుకొని మెట్లు ఎక్కుతూ. రూం లో కి వెళ్లి నన్ను పిలిపించారు. ఎప్పుడు వెడుతున్నాను ఏమిటి అని అడుగుతూ ఆయన సంతకం చెయ్యాల్సిన కాగితాలన్నీ నింపి సంతకం చేస్తున్న ఆయన్ని చూస్తూ అలా ఉండిపోయాను. "హౌ ఈస్ యువర్ హెల్త్" అని అడగడానికి కూడా నోట మాట రాలేదు. కళ్ళలో నీళ్ళు మాత్రం తెలియకుండా వచ్చేసాయి. వంగి పాదాలకి నమస్కారం మాత్రం చేయగలిగాను. "అల్ ది బెస్ట్" అన్నారు. పని అవగానే మళ్ళీ అటెండర్ సాయం తో అదే ఆటో ఎక్కి వెళ్ళిపోయారు. ఆ తరవాత నేను అనుకున్న ప్రకారం ఇంటికి వచ్చేశాను. "మళ్ళీ రమ్మను", "నీకు సాయం చేస్తే నాకేమిటి", "నేనివాళ ఏ పని చేయదలచుకోలేదు" అనే మనుషులు విరివిగా కనిపించే లోకం లో ఇలాంటి వాళ్ళు తారసపడడం నా అదృష్టం అనిపిస్తుంది. వెళ్లి మళ్ళీ రమ్మంటే తప్పని సరై వైజాగ్ వెళ్లి మళ్ళీ వచ్చే వాడినేమో కాని, ఆయన ఈ సహాయం చెయ్యడం ద్వారా "going the extra mile" అంటే ఏమిటో ఆచరణలో చూపించారు. నాచేత "there's gotta be a way" అని నమ్మించారు.

Tuesday, November 22, 2011

చర్చి దర్శనం.

నిన్న చర్చి కి వెళ్ళాము. అమెరికా లో చాలా కాలం నుంచీ ఉన్నా, ఎందుకో వెళ్ళడానికి సమయం సందర్భం కలిసి రాలేదు. పెళ్ళికాకముందు ఒకసారి మా మేనేజర్ గారు చర్చి కోరస్ లో పాటలు పాడతాను అంటే వెళ్ళాము కాని, ఆ కోటి మంది కోరసుల్లో ఆయన గొంతు గుర్తు పట్టలేదు. ఇన్నాళ్ళకి మళ్ళీ నా పక్కసీటు లో పాలు గారు ("కే. ఏ." కాదు) చర్చి లో మత ప్రవచనం ఇవ్వడానికి ఏవో కోర్సులు చేసి, పరీక్షలు రాసి పాసై, అర్హత సంపాదించి మొదటి సారి ప్రవచిస్తున్నా మీరందరూ రావాలి అని అనేక విధాల (మౌఖికం గా, ఈమైలికం గా, ముఖపుస్తక రూపకం గా) చెప్పడం తోను, ఎన్నాళ్ళ నుంచో శాంతి కోరుతూ ఉండడం తోను ఇక బయల్దేరాము. ఇక్కడ మా పాలు గారి గురించి కొంచెం చెప్పుకోవాలి. ఏభై ఏళ్ళ మనిషి అయినా ఇంటా బయటా అన్ని వయసుల వాళ్ళతోనూ కలసి మెలసి తెగ హడావిడి గా ఉంటాడు. ఆయన చెప్పే కబుర్లు విని నేనే "నీ జీవిత చరిత్ర రాస్తే చెప్పు - మొదటి పుస్తకం నేనే కొంటా" అని కూడా హామీ ఇచ్చాను (ఆయన ఇంకా మొదలు పెట్టినట్టు లేదు అనుకోండి). విధి వశాన నాలుగు పెళ్ళిళ్ళు, బోలెడు పిల్లలు, అప్పులు, అనేక జీవితానుభవాలు పుష్కలం గా ఉన్న వ్యక్తి పాల్. దానికి తోడు తన ఇరవై ఆరో ఏట మాని వేసిన మద్య పానం, మాదక ద్రవ్యాల అలవాట్లు మళ్ళీ తిరిగి రాకుండా ఇరవై ఐదు ఏళ్ళనుంచి కాపాడుకుంటూ వస్తున్నాడు. నిన్న ఆ విశేషపు ఇరవై ఐదో జయంతి కూడా.
పొద్దున్నే బయల్దేరి ఎగ్జిట్ వరకూ దారి తప్పకుండ వెళ్ళినా, గూగులమ్మ దయవల్ల వేరే చర్చి దేనికో వెళ్ళిపోయి మాప్ క్వెస్ట్ పుణ్యాన తిరిగి దారిన పడి, అనుకున్న సమయానికి చేరుకున్నాం. మేమేదో పదివేల మంది పట్టే అద్దాలు బిగించిన పాలరాతి కట్టడం గురించి చూస్తూ ఉంటే ఈ చర్చి వంద మంది పట్టే చిన్న హాలులా ఉంది. ఆశ్చర్యాన్ని అణచుకొని లోపల ప్రవేశించి పరిచయాలు చేసుకున్నాము. అప్పటికే అక్కడ చేరినవాళ్ళు "వీళ్ళు ఏమిటి, చర్చి లో కి రావడం ఏమిటి" అని హాశ్చర్యపోతూ మమ్మల్ని కరచాలనాలతోను, మా పిల్లల్ని బుగ్గ పుణుగులతోను ఆహ్వనించేరు. ఒక తండ్రి కొడుకు ద్వయం గిటార్ మీద రెండు పాటలు వాయించిన తరవాత, మా పాల్ గారి ప్రవచనం తో ఆ రోజు సభ ముగిసింది. చూడబోతే మన గుడిలాగా కాకుండా వీళ్ళ చర్చి ఆదివారం అయిన సరే కొంత సేపు మాత్రమే తెరచి ఉంటుంది అనుకుంటా.. ఈ మతంలో సమయపాలన కొంచెం ఎక్కువేమో అనిపించింది. పొద్దున్నే పదిన్నర కి ప్రార్ధన అంటే అందరూ చేరుకున్నారు. పదకొండున్నర కి జారుకున్నారు. "గుడి ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఎనిమిది వరకు తెరచి ఉండును" అని తెలిస్తే మనలో ఎక్కువ మంది చా..లా.. నెమ్మదిగా లేచి, మిగిలిన పనులు అన్నీ కానిచ్చుకొని తీరికగా వెడతాము. ఐతే మతాలలో సామ్యం కూడా కనిపించింది. వీళ్ళు గిటార్లు వాయిస్తే గుళ్ళలో భజనలు చెయ్యడం, పాస్టర్లు ప్రవచనం చేస్తే మన దగ్గర పురాణ కాలక్షేపం అలా. మనస్ఫూర్తి గా అందరి మంచి కోసం ప్రార్ధించి "నేను పాపిని" అని ఒప్పుకొని, వాళ్ళిచ్చిన కుకీలు తింటూ పేద వాళ్ళ నిధి కి కొన్ని తృణాలు ఇచ్చి తృప్తి గా బయటకి వచ్చాము.

Friday, August 5, 2011

ఇష్టం అంటే...

"నాన్నంటే నాకిష్టం"
"నాకు కూడా శ్రీహర్షబాబంటే బోలెడంత ఇష్టం"
"నాన్నా.."
"ఊ..."
"ఇష్టం అంటే?"
".................. ఇష్టం అంటే, నువ్వు ఎప్పుడైనా తమ్ముని కొట్టడం, తోసెయ్యడం చేస్తావు కదా.. అప్పుడు నాన్న 'హన్నా.. అలా చెయ్యకూడదు' అని కేకలేస్తారు కదా.. కాని వెంటనే ఇలా పట్టేసుకుంటారు - అదీ ఇష్టం అంటే" నాన్నకి ఏమి చెప్పాలో తెలియలేదు.

"ఓహో...." శ్రీహర్ష బాబుకి మాత్రం చక్కగా అర్ధం అయింది!! :).

Friday, July 1, 2011

నీళ్ళెలా తాగాలి?

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగి విమానం మారుతున్నప్పుడు ఈ వాటర్ ఫౌంటెన్ నాకు స్వాగతం చెప్పింది. చూడబోతే ఇది ఫౌంటెన్ (నీళ్ళు కింద నుంచి పైకి చిమ్మే)లా కాకుండా "కుళాయి" (నీళ్ళు పై నుంచి కిందకి పడే)లాగ ఉంది.

కళ్ళతో చుట్టూ వెదికాను దగ్గరలో కాగితం గళాసులు ఏమైనా ఉన్నాయేమో అని. కనిపించలా. పక్కన కాసేపు నక్కి గమనించాను ఎవరైనా దానితో తాగడం చూసి ఎలా తాగాలో నేను కూడా నేర్చుకుందామని. అందరూ ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు వెళ్ళిపోతున్నారు తప్ప ఆగి అది వాడడం లేదు. పక్కనే ఒకాయన ఇద్దరు పిల్లలతో వెడుతూ నాలాగే అనుమానం గా దానికేసి చూస్తున్నాడు. "ఇదెలా..." అని నేను పూర్తి చేసేలోగా "హి హ్హి" అని మల్లిక్ కార్టూన్ లో లాగ నవ్వి మౌనం వహించాడు. అప్పుడు ఇంక లాభం లేదు అని, అటుగా వెడుతున్న ఒక ఎయిర్ పోర్ట్ ఉద్యోగినిని అడిగా "దీనిలో నీళ్ళు తాగడం ఎలాగండి" అని - ఆవిడ ప్రశ్న ని తెలుగు లో అర్ధం చేసుకొని ఇంగ్లీష్ లో సమాధానం చెప్పడానికి ప్రయత్నించింది. "You put head under" అంటూ.. నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఎందుకంటే, సామాన్య పీక నిర్మాణం కలిగిన మానవుడు ఎవడూ నేల మీద రెండు కాళ్ళూ ఉంచి ఆ పడుతున్న నీళ్ళ కింద మూతి పెట్టలేడు - కొండొకచో పెట్టినా నోట్లో పడిన నీళ్ళని మింగలేడు. అలా నేను కాసేపు సతమతమై, ఇంకా అవలేక దగ్గరలో ఉన్న కొట్లో నీళ్ళ సీసా కొనుక్కొని బయటపడ్డాను.
ఇలాంటిది ఏదో పెడదామని వాళ్ళ గుత్తేదారు (contractor) హృదయం కాబోలు.

Saturday, May 14, 2011

(మా) రాజమండ్రి విమానాశ్రయం.

చిన్నప్పుడెప్పుడో ఒకసారి (అంటే ఇంచుమించు 1986 అనుకుంటా) - రాజమండ్రి నుంచి వాయుదూత్ విమానంలో హైదరాబాద్ వెళ్ళాము. విమానం ఎక్కడం అదే మొదటిసారి - ఆ వాయుదూత్ లో అంత ప్రమాదం ఉంటుంది అని తెలియదు - విమానం ఎక్కాలి అనే సరదాయే తప్ప. ప్రమాదం అని ఎందుకు అన్నానంటే మేము ఎగిరిన చాలా రోజుల తరువాత వేరే వాయుదూత్ విమానం కూలి పాపం అందులో వాళ్ళు అందరూ పోయారు. వెంటనే ప్రభుత్వం వారు మేల్కొని మొత్తం వాయుదూత్ నే రద్దు చేసారు అనుకోండి అది వేరే విషయం. అప్పుడు ఇప్పటిలా విరివిగా విమాన సర్వీసులు, వాటిమీద ప్రభుత్వ నిఘా ఉండేది కాదు. రాజమండ్రి విమానాశ్రయానికి బయల్దేరి, సగం దూరంలో మా వాహనం (ఆటో లెండి) చెడిపోతే అటుగా వెడుతున్న విమానాశ్రయం వారి జీప్ లో ఎక్కడం, అందులో ఉన్న ఆఫీసర్ - ఎంత పెద్ద ఉద్యోగమో మనకి తెలియదు కాని, ఆ ఎయిర్ పోర్ట్ అంతా తనదేననీ, విమానాలు ఎక్కడానికి వచ్చేవాళ్ళకి తను విమానం ఎక్కే అవకాశం ఉచితం గా ఇస్తూ మహా సేవ చేసేస్తున్నాననీ - అందువలన గారంటీ గా స్వర్గానికే వెడతాననీ నమ్మకం పెట్టుకున్నవాడిలా మొహం వేసుకొని మా వైపు మహా చిరాకుగా చూడడం ఇంకా గుర్తు :). అన్నట్టు ఆ ఫ్లైట్ లో కూర్చొని ఆ విశేషాలు వర్ణిస్తూ మా అమ్మగారికి ఉత్తరం కూడా రాసేము మా అన్నయ్య, నేను - అది హైదరాబాద్ వెళ్ళాక పోస్ట్ చేసాము.

ఏదైనా, మొన్న మళ్ళీ హైదరాబాద్ నుంచి రాజమండ్రి కి కింగ్ ఫిషేర్ వారి విమానం లో వెడుతూ ఉంటే ఇవన్నీ గుర్తుకి వచ్చాయి. ప్రపంచం అంతా మారిపోయింది కాని, మా రాజమండ్రి విమానాశ్రయం మాత్రం ఇంకా అలాగే ఉంది (ఇంకోటి కడుతున్నారు - ఇంచుమించు తయారు అయిపోయినట్టే ఉంది). మళ్ళీ వచ్చేసరికి ఇది ఉంటుందో, తీసేస్తారో అని ఇలా కొన్ని ఫోటోలు తీశాను. చిన్నప్పుడు ఎలా ఉందో గుర్తు లేదు కాని, నాకు ఇప్పుడు ఉన్న ఎయిర్ పోర్ట్ మాత్రం భలే నచ్చింది. ఏదో నలుగురు సెక్యూరిటీ వాళ్ళు, ఇద్దరు ముగ్గురు అధికారులు, పది మంది కూలీలు, వచ్చిన వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి ఒక ఇరవై వరకు కార్లు, వాటితో వచ్చిన జనం, "మనం మేకప్ ఎక్కడ వేసుకోవాలి" అనుకుంటూ దిక్కులు చూస్తున్న విమాన వనితలు - అంతే. ఎనౌన్స్మెంట్లు, అనవసరంగా వాగుతూ ఉండే టీవీలు, కిచ కిచ శబ్దం చేసుకుంటూ తిరిగే కన్వేయర్ బెల్టులు అవీ లేకుండా మహా ప్రశాంతంగా ఉంది. ద్వారపూడి రైల్వే స్టేషన్ కూడా ఇంత నిశ్శబ్దంగా ఉండదు. అందులో మధ్యాహ్నం పదకొండు ప్రాంతంలో దిగామేమో, అప్పుడే గోదావరినీ, లంకల్లోని కొబ్బరి చెట్లనీ పైనుంచి చూస్తూ "ఇంటికొచ్చేసాము" అనుకుంటూ ఉండడంతో ఆ ఫీలింగ్ చాలా చక్కగా అనిపించింది. ఆఖరికి లగేజ్ కూడా ఎంచక్కా రెండు తోపుడు బళ్ళలో వేసుకొని వచ్చి మా ముందు పడేసారు. సింపుల్ గా ఏరేసుకున్నాము.

ఇదిగో మరి ఆ ఫోటోలు. గోదావరి మీద కడుతున్న లేటెస్ట్ వంతెన (మరి పేరు ఏమి పెడతారో తెలియదు) కూడా ఉంది చూడండి.