Saturday, June 21, 2008

తల్లి పాలు.

(ఈ టపా కి వ్యాఖ్యలు వ్రాసినవారందరికీ కృతజ్ఞతలు. వారి వ్యాఖ్యల వల్ల మరిన్ని అంశాలు జోడించడం జరిగింది)కిందటి సంవత్సరం జూన్ లో ప్రసారం చేసిన బాలు గారి పాడాలని వుంది రికార్డింగ్ చూస్తూ వుంటే ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. తల్లి పాలు అప్పుడే పుట్టిన పిల్లలకి చాలా మంచివి అనీ, మన వాళ్ళు (చాలా మంది) ఆ విషయం తెలుసుకోకుండా, పిల్లలు పుట్టిన వెంటనే తల్లి దగ్గర పాలు తాగనివ్వరనీ, దీనిని నిరోధించాల్సిన అవసరం ఉంది అని. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నా మొట్ట మొదటి రియాక్షన్ ఏమిటంటే, అలా చేసే వాళ్ళని ఒక గది లో వేసి బంధించి "మా తప్పు తెలిసింది మహాప్రభో" అనేవరకూ రోజూ రెండు పూటలా ఇంత పచ్చగడ్డి పెట్టాలి. అప్పుడు తెలుస్తుంది అమృతతుల్యమై, రోగ నిరోధక శక్తి ని కలిగించే తల్లి పాలు దూరం చేసి పిల్లలకి పోత పాలు పోస్తే వాళ్ళకి ఎలా వుంటుందో!!. అసలు బిడ్డ పాలు తాగకపోతే ఆ తల్లి కి ఎదురయే కష్టం కూడా (engorgement (పాలిండ్లలో పాలు నిండిపోయి నెప్పి పుట్టడం) వల్ల) వర్ణించనలవి కాదు. సృష్టి లో జరిగే ప్రతీ విషయం కూడా పరస్పర ఆధారితం గా జరుగుతుంది (Symbiosis). పురుడు వచ్చే సమయానికి తల్లికి పాలు ఉత్పత్తి కావడం, అప్పుడే పుట్టిన బిడ్డ కి ఏమి తెలిసినా తెలియకపోయినా పీల్చే ఒక్క విద్య (sucking instinct) మాత్రం తెలవడం, బిడ్డ పాలు తాగగానే తల్లికి తేలికగా అనిపించడం - ఇది సృష్టి ధర్మం. దానికి విరుద్ధం గా "అప్పుడే పుట్టిన బిడ్డ కి తల్లి పాలు ఇస్తే "దోషం"" అనో, పసుపు రంగులో వుండే చిక్కని పాలు ("మురుగు పాలు" అనో, మరొకటనో) తాగితే బిడ్డకి అరగవు అనో అనుకోవడం మూర్ఖత్వం తప్ప మరోటి కాదు. మిడి మిడి జ్ఞానంతో అన్నీ తమకే తెలుసునని అనుకోవడం, తాము అనుకున్నదే కరెక్ట్ అని, తమ ఆధిపత్యం నిరూపించుకోవడమే లక్ష్యమని అనుకునే కొందరు మొదలు పెట్టిన ప్రచారం ఇది. ఆఖరికి తల్లి కి జ్వరం వచ్చినా కూడా పిల్లలకి పాలు ఇవ్వడం ద్వారా అది వాళ్ళకి సంక్రమించదంటే తల్లి శరీరం లో పాలిచ్చే వ్యవస్థ ఎంత ఎస్టాబ్లిష్ అయి వుందో తెలుస్తుంది. ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎంత అభివృద్దిని సాధించినా, తల్లి పాలలో వుండే గుణాల్ని లేబరేటరీ లలో సృష్టించలేకపోయారు. సృష్టి కి ప్రతి సృష్టి చెయ్యడం సాధ్యమా? బిడ్డ భవిష్యత్ తెలివితేటలు, మానసిక ఎదుగుదల అన్నీ కూడా పుట్టిన మొదటి కొద్ది రోజుల్లో తల్లి నుంచి అందే పోషకాల మీద ఆధారపడతాయని ఎన్నో స్టడీలలో నిరూపించారు. దానికి విరుద్ధం గా బిడ్డని తల్లిని వేరు చెయ్యడానికి ప్రయత్నించే చేతుల్ని విరగ్గొట్టడం ఏ మాత్రం తప్పు కాదు.మరొక విషయం గర్భిణి స్త్రీలు తినవలసిన ఆహారం. తల్లికే బలం లేకపొతే బిడ్డ కడుపు లో వున్నప్పుడు అందివ్వాల్సిన పోషకాలు అందివ్వలేకపోవడం, తద్వారా బిడ్డ కి విత్తు గా వున్నప్పుడు అంది అరాయించుకోవాల్సిన గుణాలు అందకపోవడం జరుగుతుంది. పెద్ద వాళ్ళని విమర్శించడమే కాకుండా ఒక గర్భవతి గా మనం ఏమి చేస్తున్నామో కూడా పరికించుకోవాలి. కొంత మంది గర్భం దాల్చగానే, అది తమకి ఇష్టం వచ్చిన వస్తువులన్నీ తినెయ్యడానికి లైసెన్సు వచ్చిన సందర్భం గా అనుకోవడం కనిపిస్తుంది. చాల మంది ఇతర ఆడవాళ్ళు కూడా "ఇప్పుడు నిన్ను ఎవరూ ఏమి అనరు - నీ ఇష్టం వచ్చినంత తినొచ్చు" అని ప్రోత్సహిస్తారు (చాల మంది తాము చెయ్యలేకపోతున్నది మరొకరి చేత నైనా చేయించి చూసి తమకి తెలియకుండానే తృప్తి చెందుతారు). "ఎంత తిన్నా ఇప్పుడు నీకు ఏమి చెయ్యదు" అని చెప్పడం కూడా కద్దు. ఎక్కువ తినడం కన్నా, బలవర్ధకం గా తినడం అనేది ముఖ్యం. "ఇద్దరి కోసం తినాలి" అనేది ఎంత నిజం ఐనా, "ఇద్దరికోసం సరిపడా పోషకాలు తీసుకోవాలి" అనేది అసలు విషయం. గర్భవతి గా వున్నప్పుడు బరువు పెరగడం సహజమే ఐనా, "అతి సర్వత్ర వర్జయేత్" అని అతి బరువు కూడా డెలివరీ దగ్గర complications కలిగిస్తుంది. సిజేరియన్ అవసరం అవడానికి overweight గా వుండడం కూడా ఒక కారణం. తినడం, దానితో బాటు సరైన వ్యాయామం చెయ్యడం అవసరం. వ్యాయామం తిన్న దానిలో junk ని కరిగించడం తో బాటు, తిన్నది వంటికి వంటబట్టేటట్టు చేస్తుంది. నెలలు నిండి, డెలివరీ దగ్గరకి వచ్చేకొద్దీ కడుపు లో బరువు తో వ్యాయామం చెయ్యడం కష్టం అవడం జరుగుతుంది. ఐతే, పూర్తి గా మానివెయ్యకుండా చివరి వరకు చెయ్యడం ముఖ్యం. High risk pregnancy లలో డాక్టర్ లు చివరి రోజుల్లో (కొన్ని సార్లు పూర్తిగా) వ్యాయామం చెయ్యవద్దని చెప్పడం కూడా జరుగుతుంది - అటువంటి పరిస్థితులలో తప్ప, వ్యాయామం (కొద్ది కొద్ది గా నడుస్తూ వుండడం, శ్వాస కి సంబంధించిన వ్యాయామాలు చెయ్యడం) వదలక్కరలేదు. Pregnancy మొదలు అయిన మొదటి ఆరు వారాల్లో నాలుగు లో ఒక pregnancy అబార్షన్ తో ముగుస్తుందని, ఆ ఆరు వారాలు గడిస్తే, చాలా pregnancy లు చివరి వరకు ఇంచుమించు గా కొనసాగుతాయని డాక్టర్ లు చెబుతారు. ఐతే, ఏదేని కారణం చేత మధ్యలో abort అయితే ఆ అమ్మాయి ఈ పని చేసింది, ఆ పని చేసింది, అందువల్లనే అలా జరిగింది అని వేళ్ళు చూపించడానికి అందరూ సిద్ధం అయిపోతారు. మనం మరీ బండ గా వ్యాయామం (అప్పటి వరకు వాకింగ్ కూడా అలవాటు లేని వాళ్ళు వున్నట్టుండి పరుగులు ఎత్తడం మొదలు పెట్టడం లాంటివి) చెయ్యకపోతే, అలా జరగడానికి వ్యాయామం కారణం కానేకాదని నాకు మొదటి సారి జరిగినప్పుడు డాక్టర్ బల్ల గుద్ది మరీ చెప్పారు. మేము మొదటి సారి హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన handout మీద వున్న నినాదం నాకు బాగా నచ్చింది.. ప్రెగ్నంట్ గా ఉన్నప్పుడు చూసుకోవాల్సిన మూడు "w" లు Walking, Water and Weight. వ్యాయామం, బరువుతో బాటుగా, వీలు అయినన్ని నీళ్ళు తాగడం చాలా మంచిది. వ్యాయామం వల్ల కండరాలు flexible గా తయారై, డెలివరీ సమయం లో చాలా సులువుగా సంకోచ వ్యాకోచాలు చెంది, పురుడు సాఫీ గా అవుతుంది. తరువాత కూడా, రికవరీ కి తక్కువ టైం పట్టడం, ఆరోగ్యం కూడా నిలకడగా ఉండడం చూడవచ్చు. "గర్భిణి స్త్రీ భోజనం లో తప్పకుండా నెయ్యి వేసుకోవాలి, చిక్కని పాలు తాగితే రేపు బిడ్డ పుట్టాక పాలు బాగా పడతాయి" అనుకోవడం కూడా మిధ్యే. నెయ్యి లో ఉన్న కొవ్వు తల్లి ఒంట్లోనే వుండిపోతుంది తప్ప బిడ్డ "లావు" గా పుట్టడం జరగదు. అలాగే, ఎన్ని పాలు తాగినా అవి బిడ్డకి ఇవ్వడం కోసం శరీరం నిలవ ఉంచుకోదు. పాలు అనేవి తల్లి శరీరానికి ఉపయోగించడానికే కాబట్టి ఆమెకి సరిపడా మాత్రమే తీసుకోవడం మంచిది (అమెరికా లో కొవ్వు తీసేసిన (ఫాట్-ఫ్రీ) పాలు వేరుగా దొరుకుతాయి. నేను గర్భవతిని అయినప్పుడు మేము అప్పటి వరకు వాడుతున్న ఫాట్-ఫ్రీ పాలు కాక వేరే పాలు తాగాల్సిన అవసరం లేదని చెప్పారు డాక్టర్). మొత్తం ప్రెగ్నన్సీ అంతట్లో, మనం సాధారణంగా 25-30 పౌండ్లు (11-14 కేజీలు) మించి బరువు పెరగడం మంచిది కాదు అని చెబుతారు. ఈ range మన height ఎంత, pregnancy కి ముందు మనం ఎంత బరువు ఉన్నాము అనేదాన్ని బట్టి కొద్దిగా మారినా, పెద్ద తేడా లేదు.
అలాగే, "పథ్యం" పాటించడం. ఆ పండు తింటే జలుబు చేస్తుందనో, ఈ పప్పు తింటే అరగదు, చీము పడుతుంది అనో, పాలు తాగితే ఇంకోటనో, తల్లి కి ఏమీ పెట్టకుండా మాడుస్తారు. నిజానికి ఇంట్లో ఎవరు తిన్నా తినకపోయినా పర్లేదు గానీ, పిల్లకి పాలిస్తున్న తల్లి కడుపు నిండా సంపూర్ణాహారం తినడం ఎంతో ముఖ్యం. నిజమే, పురుడు వచ్చిన మొదటి ఒకటి రెండు రోజుల్లో తినాలని లేకపోయినా, సిజేరియన్ లాంటి సందర్భాల్లో డాక్టర్ లు ఒకటి రెండు రోజులు తినవద్దని చెప్పినా పరవాలేదు గాని, పథ్యం వెర్రి తలలు వేసి, ఆరు నెలలు, ఏడాది పాటు తల్లికి ఏమీ పెట్టకుండా, పిల్ల కి ఇవ్వడానికి పాలు కావాలంటే ఎక్కడ నుంచి వస్తాయి? ఇంక అక్కడ నుంచి "బిడ్డ కి ఇవ్వడానికి పాలు రావట్లేదు" అని తల్లిని తక్కువ చెయ్యడమో, పాలు పడడం కోసం మందులు వాడడం మొదలు పెట్టడమో చేసేకంటే, తల్లికి సరైన ఆహారం పెడితే జరగాల్సిన విషయాన్ని సృష్టే చూస్తుకుంటుంది అనే ఇంగితం కరువవుతోంది మన వాళ్ళకి. కొన్ని ప్రదేశాలలో తల్లికి పాలు ఇస్తే బిడ్డకి మంచిది కాదు అని, కాఫీ తప్ప మరోటి తాగనివ్వరట. ఎంత అన్యాయం! పిచ్చి నమ్మకాలు ఎలా ఉంటాయంటే భోజనం తరువాత తల్లి నిద్ర పొతే "మంచిది కాదు" అని పడుకోనివ్వకుండా మనుషులు కాపలా కూర్చోవడం! డెలివరీ అయ్యాక నీరసం, అసహనం, డిప్రెషన్, నిద్రలేమి లాంటి వాటితో బాలింతరాలు బాధపడుతూ ఉంటుంది. ఈ సయమం లో సరైన భోజనం, కంటినిండా నిద్ర ఎంతైనా అవసరం.ఇక్కడ డెలివరీ అయిన తరవాత వెంటనే తినడానికి బీన్సు, ఉడికించిన బంగాల దుంపలు అవీ ఇస్తారు (వ్యాఖ్యల్లో రాధిక గారు చెప్పినట్టు). ఆరెంజి జ్యూస్, పాలు లాంటివి సర్వ సాధారణం. నా డెలివరీ తరవాత అదే హాస్పిటల్లో పనిచేసే తెలుగు డాక్టర్ని అడిగితే పప్పులు, కూరలతో బాటు ఏమి తిన్నా పరవాలేదు అని చెప్పారు. అది నిజం కూడా. ప్రెగ్నన్సీలో బొప్పాయి తినవద్దని, గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ (ఇది మన దగ్గర (ఇండియా లో) దొరుకుతుందో లేదో తెలియదు) తాగవద్దని ఐతే మాత్రం చెప్పారు. అవి తాగడం వల్ల దోషం వుందని నిరూపించబడలేదు గాని, వాటిలో ప్రెగ్నన్సీ కి వ్యతిరేకం గా పని చేసే ingredients ఉండవచ్చని అంటారని చెప్పారు. ఒకసారి డెలివరీ అయిన తరవాత ఇంక తినదగిన వస్తువులు, తినకూడని వస్తువులు అంటూ ఏమీ లేవు. ఇష్టం ఐనవి ఏమైనా తినొచ్చు. కాకపోతే తల్లి వద్ద నుంచి పిల్లలకి పాలు వెడతాయి కాబట్టి, మనం తినే వాటిని బట్టి పిల్లలు effect అయే అవకాశం ఉంది. అందుకని, పిల్లలు మామూలు కంటే ఎక్కువగా ఏడుస్తున్నా, వాళ్ళకి విరేచనం రెగ్యులర్ గా అవకపోయినా, మనం ఏమి తిన్నాము అని కూడా (పిల్లల) డాక్టర్ లు అడుగుతారు. కానీ, వాళ్ళ ఆ ప్రవర్తన కి ఇది ఒక్కటే కారణంగా పరిగణించడం జరగదు. చాలా సార్లు వాటి రెంటికీ సంబంధం ఉండదు కూడా. ప్రెగ్నంట్ గా వున్నప్పుడు చెప్పిన సూత్రమే ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఇద్దరి కోసం తినాలి కదా అని ఎక్కువ తినడం సరికాదు. బలవర్ధకమైన పోషకాహారం తినడం, వ్యాయామాన్ని ఎంత తొందరగా వీలు ఐతే అంత తొందరగా తిరిగి మొదలు పెట్టడం (ఇది మాత్రం కొత్తగా తల్లి ఐన వారికి చాల కష్టం అనిపిస్తుంది - రోజులో వంద గంటలు వున్నా సరిపోని పని వుంటుంది పిల్లలతో - ఐనా సరే, ఎక్కడ దొరికిన ఎక్సరసైజ్ అక్కడ చెయ్యడం తప్పదు). సృష్టి లో గొప్పదనం ఏమిటంటే, అది ఎప్పుడూ కూడా, దేనిలోనైనా సరే "equilibrium" (సంతులనం) కోసం ప్రయత్నిస్తూ వుంటుంది. డెలివరీ కాగానే, శరీరం తిరిగి మామూలు స్థితి కి చేరుకోవడానికి ప్రయత్నాలు వెంటనే మొదలు పెడుతుంది. చర్మం సంకోచించి తిరిగి ప్రెగ్నన్సీముందు స్థితి ని చేరడానికి ప్రయత్నించడం, గర్భసంచి తిరిగి మరొక ప్రెగ్నన్సీకి సిద్ధంగా పూర్వ స్థితికి చేరడం, కొద్ది నెలల్లో నెలసరి మొదలు కావడం ఈ కోవలోకి వస్తాయి. ఐతే శరీరం ఎంత ప్రయత్నించినా, మనం అది అనుకునే స్థాయి కి మించి తినడం జరుగుతుంది కాబట్టి మన చేయూత కూడా దానికి అవసరం (ఎక్సరసైజ్ రూపం లో). బంగాళాదుంపలు లాంటివి carbohydrates కావడం వల్ల వాటికి బరువు పెంచే గుణం వుండడం వల్ల వాటిని మితం గా తీసుకోవచ్చు. మానెయ్యక్కర్లేదు. అన్నం కూడా కార్బ్స్ category కి చెందుతుంది కాబట్టి ఒక పూట అన్నం బదులు రెండు చపాతీలు, బోలెడంత కూర తో రిప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇక నడుముకి గుడ్డ కట్టుకోవడం అనేది హెల్ప్ చేస్తుందని అంటారు. నేను ఇందాక చెప్పిన తెలుగు డాక్టర్ గారు కట్టుకోమనే సలహా ఇచ్చారు. మొదటి రెండునెలల్లో ఇది బాగా వాడాలి అని చాలా సార్లు విన్నాను. ఒక సంగతి ఏమిటంటే, మరీ ఊపిరి ఆడనంత గట్టిగా కట్టెయ్యకుండా ఉంటే దాని వల్ల నష్టం ఏమీ వుండదు. శరీరానికి adoptability ఉంటుంది కదా. (ఏ దేశం లోనో మరచిపోయాను. అక్కడ ఆడవాళ్ళు మెడకి మన పెద్ద వాళ్ళు కాళ్ళకి వేసుకొనే పెండేరాలంటివి వేసుకొని ఉంటారు. దానికి చోటు చెయ్యడం కోసం మెడ సాగుతుంది. అప్పుడు ఇంకోటి తగిలిస్తారు. అలా వాళ్ళ మెడలు సాగుతూనే వుంటాయి - మెడ ఎంత పొడుగ్గా వుంటే అంత గొప్పట). ఆ సూత్రం ప్రకారం ఆలోచిస్తే ఈ గుడ్డ కట్టడం వల్ల నడుము దగ్గర చర్మం తిరిగి పూర్వ స్థితి కి వెళ్లడానికి సహాయం చేస్తుంది అనిపిస్తుంది. ఈ విషయం అమెరికా లో డాక్టర్ లకి ఆశ్చర్యం గా అనిపించడానికి కారణం వాళ్ళు ఇక్కడ కొత్తగా తల్లి ఐన వారికి ఎక్సరసైజ్ చెయ్యమని చెబుతారు. అది తప్ప మరేది అవసరం లేదు అని వాళ్ళ అభిప్రాయం. మన దగ్గర ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఎక్సరసైజ్ చెయ్యడం అనేది (ఈ కాలం లో కాదు గాని, ఇది వరకు) వింత విషయం కాబట్టి మన వాళ్ళు దానికి ప్రత్యామ్నాయం గా అది చెబుతూ ఉండి ఉండవచ్చు. ఇండియా లో కొందరు డాక్టర్ లు కూడా పథ్యం ఎందుకు చెయ్యలేదు అని అడగడం ఆశ్చర్యం గా అనిపిస్తుంది. ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారా అని కూడా అనుకుంటాను. వాళ్ళకి మనం చెప్పగలిగేది ఏమి లేదు - అలాంటి వాళ్ళని avoid చేసి వేరే వాళ్ళ దగ్గరకి వెళ్ళడం తప్ప. ఇండియా లో నాకు తెలిసిన చాలా మందికి (మా ఆడపడుచులు, ఫ్రెండ్స్ కి) డాక్టర్ లు పథ్యం అక్కరలేదు అని చెప్పారని అన్నారు. పథ్యం చెయ్యాలని చెప్పే డాక్టర్ లు తక్కువని, త్వరలో వాళ్ళు ఇంకా తగ్గుతారని అనుకోవాలి. ఏమో.. మన చిన్నప్పుడు మనకి తల్లి నుంచి దక్కాల్సిన పాలు దక్కనిచ్చి వుంటే, మన తల్లిని సరిగ్గా తిననిచ్చి వుంటే, మనం ఇప్పుడు ఉన్నదానికంటే మరింత దారుఢ్యం తో, రోగ నిరోధక శక్తి తో ఉండేవాళ్ళమేమో!!. ఇప్పటికైనా మించిపోయింది లేదు. బిడ్డ పుట్టకముందు, పుట్టిన తరవాత తీసుకోవాల్సిన ఈ చిన్ని జాగ్రత్తలు తీసుకుంటే, మన మూర్ఖపు ఆలోచనలు, మూఢ నమ్మకాలు పక్కన పెట్టి బిడ్డని ఎదగాల్సిన పద్ధతిలో ఎదగనిస్తే మన భవిష్యత్ తరాలు మరింత ఆరోగ్యం గా పెరిగి మరిన్ని తెలివి తేటలతో మనకి కృతజ్ఞతలతో ముందుకి వెడతాయి.

Friday, June 13, 2008

పిల్లల బొమ్మల ఎక్సేంజ్

ఎప్పటినుంచో అనుకుంటున్న ఇలాంటిది ఏదో ఎక్కడో వుండాలి అని (మా పిల్లవాడు పుట్టిన మొదట్లో నేనే ఒక సైట్ పెట్టేద్దామా అని కూడా అనుకున్నా). ప్రపంచం లో ఫ్యాషన్ ల కంటే తొందరగా మారిపోయే వస్తువులు ఏమైనా వున్నాయి అంటే అవి తప్పకుండ పిల్లల బొమ్మలే. అప్పుడే పుట్టిన పిల్లలకి బొమ్మలు వేరు, నెల వయసు వారి బొమ్మలు వేరు, కొద్దిగా ఎదిగి రంగులు, జంతువులు గుర్తు పట్టే వయసు వచ్చే వారి బొమ్మలు వేరే, ఆడపిల్లల బొమ్మలు వేరు, మగ పిల్లల బొమ్మలు వేరు. పిల్లలు చూస్తుండగానే ఎదిగిపోయే లక్షణం కలవారు అవటం వల్ల, ఇవాళ కొన్న బొమ్మలు నెల రోజుల్లో (రంగు, షైనింగు చెడకుండానే) పాతబడిపోయి మళ్ళీ బొమ్మల దుకాణానికి వెళ్ళే పని పెడతాయి. అలా ప్రతీ తల్లితండ్రులు పదుల కొద్దీ (కొండొకచో వందల కొద్దీ) బొమ్మలు కొని ఇల్లు నింపుతూ వుంటారు. జ్ఞాపకాలు గా దాచుకుందామన్నా, కొద్ది రోజులు పోయేసరికి అవి కాలికి అడ్డం గాను, జేబుకి చిల్లు పెట్టిన శత్రువులు గాను కనిపించడం మొదలు పెట్టి వాటిని నెమ్మదిగా బయటకి తరలించడమో, లేక రీసైకిల్ వారికి ఇచ్చేయ్యడమో జరుగుతుంది.
ఎవరికైనా ఇద్దామన్నా, వాళ్ళు వాడేసిన బొమ్మలు ఇస్తున్నారు అనుకుంటారు, "మా పిల్లలకి మేము కొనలేమా" అని అహంకారానికి పోయి మొహం మీదే వద్దంటారు అని ఒక అనుమానం. తల్లితండ్రులకేమో ఎవరినన్నా, "మీ పిల్లల బొమ్మలు వున్నాయా - మేము తీసుకుంటాము" అనాలి అంటే "లేకి" గా అడుగుతున్నారు అనుకుంటారు అని భయం. అందుకని ఇరు పక్షాలు అలా బిగిసి పోయి, బొమ్మల కొట్ల వాళ్ళకి డబ్బులు ధారాళం గా పోస్తూ వుంటారు (మీరు కాదనలేరు - ఎందుకంటే, ఇది అంతా స్వానుభావమే (పిల్లలు వున్న వారు) అందరికీ). ఈ వస్తువులన్నీ వాటి కాలం మూడే వరకు బేస్మెంట్ లలో, క్లోసేట్ లలో, అటకల మీద దుమ్ము తింటూ బ్రతుకుతూ వుంటాయి.మన పిల్లలు మనకి ఎంత అపురూపం ఐన ప్రాక్టికల్ గా ఆలోచిస్తే శుభ్రం గా వాడేరు అని తెలిసిన బొమ్మలు మన పిల్లలకి ఇవ్వడం లో అభ్యంతరం ఏముంది? ఎక్కడైనా అవి పిల్లలు వాడినవే కదా? అంతగా కావలిస్తే వాటిని శుద్ధి (శుభ్రం) చేసే పద్ధతులు బోలెడన్ని వున్నాయి. ఈ మధ్య పుట్టిన కొత్త వాదం ఏమిటంటే, బొమ్మలు రీసైకిల్ చెయ్యడం ద్వారా (తద్వారా, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం ద్వారా) హరిత భూమి (గ్రీన్ ప్లానెట్) కి మన చేయూత ఇచ్చినట్టు అవుతుంది అని. నిజమే మరి.
ఇది అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఈ రోజు ఈ సైట్ చూసాను: www.zwaggle.com. దీనిలో మన పిల్లల బొమ్మలు మరొకరికి ఇవ్వడం, మరొకరివి మనం తీసుకోవడం చెయ్యవచ్చు. బార్టర్ సిస్టమ్ లాగ అన్నమాట. ఐతే అప్పుడే పుట్టిన పిల్లలు మనకి వుంటే మనం వేరొకరికి ఇవ్వడానికి మన దగ్గర ఎక్కువ వుండకపోవచ్చు. కాకపోతే మన దగ్గర బొమ్మలు చేరేకొద్దీ దీనిని ఉపయోగించుకొని అన్ని వర్గాలు లబ్ది పొందొచ్చు. బొమ్మలే కాదు, అనేక ఇతర వస్తువులు దీనిలో ఎక్సేంజ్ చేసుకోవచ్చు. ఇలాంటిది ఒకటి మన దేశం లో కూడా అవసరం!. ఇంటర్నెట్ ద్వారానే అక్కర్లేదు. మీ దగ్గర మీ పిల్లలు ఆడుకున్న బొమ్మలు, వాడిన వాకర్ లు, ఇప్పుడు వాడలేని సైకిళ్ళు, ఏమైనా వుంటే అవి మీకు తెలిసిన వారికి ఆఫర్ చెయ్యండి. పిల్లలు కూడా తమ బొమ్మలు మరొకరు ఆడుకోవడం చూసి షేర్ చేసుకోవాలి అనే గుణం చిన్నప్పటినుంచే అలవాటు చేసుకుంటారు. మనం గమనించినా, నిన్చకపోయినా పిల్లలు మనం చేసే ప్రతీ పని ని నిశితం గా పరిశీలిస్తూ, ఫాలో అవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళలో అటువంటి మంచి లక్షణాలు పాదుకొల్పడానికి ఇది కూడా ఒక అవకాశం గా పనికి వస్తుంది. ఎటు నుంచి చూసిన, మినిముం మన ఇంట్లో కాళ్ళకి అడ్డం పడే "పనికిరాని" వస్తువులు తగ్గుతాయి :).

Wednesday, June 4, 2008

బాలు పుట్టిన రోజు

ప్రేమ రసాంత రంగ హృదయంగమ సుంగ సుభంగ రంగ బహు రంగధ భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాప ప్రుదు సంఘ విభంగా..
దీనిని అంతటినీ ఒకే గుక్కలో మధ్యలో ఊపిరి తీసుకోకుండా చదవండి చూద్దాం? కొంచెం కష్టం అయినా చదివేసారు కదా? సరే.. ఇప్పుడు రామదాసు సినిమా లో "దాశరథీ! కరుణా పయోనిధీ" పాటలోలా పాడడానికి ప్రయత్నించండి. "అబ్బో" అంటారా? ఐతే మరి దానిలో భగవంతుడినే నిలదీస్తున్నట్టు అనిపించే భావాన్ని కూడా పొందు పరచి, రాగా తాళ యుక్తంగా పాడడం అనేది ఊహకి కూడా అందదు. అందులోనూ, 62 ఏళ్ళ వ్యక్తి ఆపని చేసాడు అంటే, అతనికి తన వృత్తి పట్ల ఎంత అంకిత భావం వుంటే, పాడుతున్న పాటలో ఎంత మనసు లగ్నం చేస్తే అది సాధ్యం అవుతుంది? ఎవరి గురించి చెబుతున్నానో తెలిసిందిగా? తన వయసులో సగం కూడా లేని కుర్ర హీరో లకి కూడా తన "లేత" గొంతు తో పాడిన చక్కటి పాటతో అందాన్ని అద్దగలిగే "మన" SP బాలసుబ్రహ్మణ్యం గురించి. ఎవరికి వారికి "ఇతను నా గొంతుతోనే పాడేడు" అనిపించినా, సినిమా లలో కమెడియన్ వేషాల నుంచి విలన్ వేషాల వరకు వేసి శహభాష్ అనిపించుకున్నా, మ్యూజిక్ డైరక్షన్ చేసినా, ప్రయోక్తగా పని చేసినా ఆయనకే చెల్లింది.

ఆయన ఇన్నాళ్ళూ చేసిన పనులు ఒక ఎత్తు, ఇప్పుడు చేస్తున్న పాడాలని వుంది మరొక ఎత్తు. నాకు గుర్తు వుండీ గత పన్నెండేళ్ళు గా మొదట ఈ టీవీ లోను, తరవాత మా టీవీ లోను కొనసాగిస్తున్న ఈ యజ్ఞం ఎందరో "తెలుగు" గాయకులని సినిమా పరిశ్రమ కి పరిచయం చేసింది. మన సినిమాలలో పాడడానికి భాష రాని పరాయి గొంతుల్ని అరువు తెచ్చుకొనక్కరలేదని, సరిగా చూస్తే ఈ నేల మీదే వాళ్ళని తలదన్నే గాయకులు వున్నారని మన సంగీత దర్శకులకి ప్రతీ వారం గుర్తు చేస్తుంది. ఈ కార్యక్రమం వెనకాల వేరే చాలా మంది వున్నా, వాళ్ళకి బాలు దొరకడం కూడా మన అదృష్టమే. దీనికి నాయ నిర్ణేతలు గా వచ్చే విద్వాంసుల్ని చూస్తేనే మనకి ఈ ప్రోగ్రాం గొప్పతనం అర్ధం అవుతుంది. సొంత డబ్బింగ్ కూడా చెప్పుకోలేని సినిమా హీరోలను, హీరోయిన్ లను కాకుండా, ఆయా కళల్లో నిష్ణాతులైన వాళ్ళని న్యాయ నిర్ణేతలుగా తీసుకొని వస్తే ఆ కార్యక్రమం ఎంత రక్తి కడుతుందో ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే, పోయిన కాలం ఎంత మంచిది అయినా, "ఈ కాలం సంగీత దర్శకుల పాటలు ఎవరి పాట ఏదో గుర్తు పడితే కోటి రూపాయలు ఇస్తాను" అనేటువంటి వ్యాఖ్యలతో నేను ఏకీభవించకపోయినా, బాలు మీద నా గౌరవం చెక్కు చెదరదు. ఏమో.. నేను చూసిన ప్రపంచం కంటే ఆయన చూసిన ప్రపంచం పెద్దది కాబట్టి, అందులో నిజం కూడా వుండవచ్చు అని అనుకుంటాను.

తెలుగు వాడికే గర్వ కారణమైన మన గాన గంధర్వుడు ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని, మరింత కాలం ఆరోగ్యం గా మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ - అభినందనలు.